కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన
భగవత్ భాగవత కటాక్షాలతో జ్యోతిష శాస్త్ర పరిధిలో కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన అనే అంశంపై ప్రశ్నలు - సమాధానాలు రూపంలో మా శక్తి మేరకు మన పెద్దలు మనకి అనుగ్రహించిన విషయాలని కాస్త మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆస్థాన పంచాంగ సిద్ధాంతి, సుప్రసిద్ధ పంచాంగ కర్త, దైవజ్ఞ శిఖామణి, జ్యోతిష రత్న, శ్రీ ఉ.వే.శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారి ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం.
ప్రశ్న:- ఈ కరోనా (కోవిడ్-౧౯) వైరస్ పుట్టుకకు కారణమేమిటి?
వందే పద్మావతీం దేవీం మహిషీం వేంకటేశితుః
కృపయాస్మాన్ సముద్ధర్తుం కృతావతరణాం భువి
శ్రీవాత్స శ్రీనివాసార్యః శోణుం గోవింద దేశికం
సంప్రాప్తోభయ వేదాంత సారం సద్గురుమాశ్రయే
ప్రియ భగవత్ బంధువులందరకూ జై శ్రీమన్నారాయణ. యాజ్ఞికపీఠమ్ నుంచి శ్రీమాన్ కిశోరస్వామి వారి ప్రార్ధన మేరకి పెద్దలు అనుగ్రహించిన విషయాలను మనం చర్చించుకుంటున్నాం.
సమా:- ఈ శార్వరి నామ సంవత్సరంలో పెద్ద ఉపద్రవం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది వికారి నామ సంవత్సరంలో ఏర్పడింది. వికారి నామ సంవత్సరంలో ఆరంభమైన ఈ సన్నివేశం ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? అని మనం ఒకసారి చూసినట్లయితే...
యదా జీవయుతో మందో జీవాద్వా సప్తమే స్ధితః
తదా ప్రజా వినశ్యంతి... అన్నట్లు
బృహస్పతి శనితో కలిసి ఉన్నా, శని నుండి సప్తమంలో ఉన్నా ప్రజా నాశనం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడతాయి అని ప్రమాణం. అక్టోబర్ ౨౦ ౨౦౧౯ బృహస్పతి శనితో కలవడం. శని గురు కేతు గ్రహాలు ఎప్పుడు ఒకే రాశిలో ఉన్నా యుద్ధాలు, దుర్భిక్షాలు, అంటువ్యాధులు కలుగుతూంటాయి. అదే మిధున కన్య ధనుస్సు మీన రాశులలో అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది. అయితే అదే ధనుస్సులో మూడు గ్రహాల కలయిక జరిగింది. అది సూర్యుడు తులా రాశి నుండీ మకర రాశిలోకి ప్రవేశించే కాలం. ఆ సమయంలో వైరస్ ఏర్పడింది. లేదా పుట్టింది.
ప్రశ్న:- ఈ వైరస్ తీవ్రత, ఎక్కడ ఎలా ఆరంభమైంది?
సమా:- ఈశాన్య దేశేషు అనే ప్రమాణంతో ఈశాన్య ప్రాంతంలో ప్రారంభం అవుతుంది అనీ, ఆ ప్రాంతంలోనే చైనా ఉంది అని మనకు తెలుస్తోంది. చైనాలోనే ఈ వ్యాధి ప్రారంభమైనా ఆ దేశం అప్పుడే బయట పెట్టలేదని అమెరికన్ రిపోర్ట్ చెబుతోంది కానీ...
రవి రాహు మహీపుత్రాః శశి శుక్ర శనైశ్చరాః
ఏక రాశిం గతాశీతే తదా పృథ్వి భయాకులా
పూర్వదేశే మహా పీడా నృపాణాం సంక్షయో భవేత్
ప్రజా నాశో జాయ భయం తస్క.....న సంశయః
రవి రాహు చంద్ర శుక్ర శని గ్రహములు ఏకరాశి గతులైనప్పుడు భూమండలమందు భయం ఏర్పడుతుంది. తూర్పు దేశాలలో మహాపీడ, నాయకులకు నాశనము, వ్యాధి భయము, ప్రజా నాశనము నిస్సందేహముగా కలుగుతాయని ప్రమాణం. డిసెంబర్ ౨౬న షష్ఠ గ్రహ కూటమి ౬ గ్రహములైన గురు శని కేతు రవి చంద్ర బుధులతో ధనస్సులో ఏర్పడడం జరిగింది. సాధారణంగా షష్ఠ గ్రహ కూటమి ఏర్పడటం జరుగదు. అలా ఏర్పడితే అది ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది అని అర్థం. అదృష్టం కొద్దీ కుజ శుక్రులు అక్కడ లేరు అది కొంత విశేషం. ఈ గ్రహాల కూటమి వల్ల ఏర్పడ్డ వైరస్ క్రమంగా పెరుగుతూ డిసెంబర్ ౩౧న ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడే మహామారి ప్రారంభమైంది. ప్రజా వినాశనానికి బీజం పడిందని అని చెప్పవచ్చు. రాహువు ఆర్ద్రా నక్షత్రంలో మిధున రాశిలో, చంద్రుడు కుంభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు మకరంలో గురువు ధనుస్సులో ఉన్నాడు. ధనుస్సులో ఐదుగ్రహాలు కలవటంతో మరొక ’పంచ గ్రహ కూటమి’ ఏర్పడింది.
జనవరి ౨౩వ తేదీన చంద్ర బుధ శని రవి గ్రహాలు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశించాయి. అప్పుడు గురువు ధనస్సులో ఉన్నాడు. గురు కేతువుల కలయికతో ప్రపంచం అంతా వైరస్ గురించి తెలిసింది. దీనిలో శని సూర్య సూర్యుల కలయిక జరిగింది. శని సూర్య గ్రహాలు వైర గ్రహాలు. వీరి కలయిక మృత్యు ప్రళయ సూచిక. ఇదంతా మకర సంక్రాంతి తరువాత తారాస్థాయికి చేరుకొని ప్రపంచ దేశాలకు పాకడానికి కారణం అయింది. ఇది అత్యంత దుఃఖాన్ని కలగజేస్తోంది.
యదా కర్కస్య సంక్రాంతి రధా మకరస్య సౌ
భవత్కార్యాహి భౌమానం వాణీ దుఃఖ ప్రదామతా
మకర సంక్రాంతి తరువాత ఇది తీవ్రరూపం దాల్చింది. కుజుడు మకరంలో శని గురువులతో కలయిక జరిగింది. అయితే ఫిబ్రవరి ౮న కుజ కేతు గురువుల కలయిక వల్ల ప్రపంచమంతా పెను ప్రమాదంగా మారింది. కనుక కుజ కేతువులతో గురువు కలవటం వల్లే వైరస్ ప్రభావితం అయింది. దానివల్లే ప్రపంచమంతా బీభత్సంగా మారిపోయింది అని స్పష్టమవుతోంది. అలాగే ఫిబ్రవరి ౧౮ నుండి మార్చి ౫ వరకు రాహు కేతువుల మధ్యలో ఇతర గ్రహాలు చేరి కాల సర్పదోషం ఏర్పడింది. ఇంకా కొంచెం పరిశీలన చేసినట్లయితే మండుచున్నటువంటి అగ్నిలో ఆజ్యం వేసినట్లయింది. దాంతో ఈ కాలసర్ప స్థితి ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మానవాళికి ఉపయోగపడే శుభ గ్రహాలకు వాటి ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది. అంటే మంచిని కలిగించే గ్రహములు వాటి శక్తిని కోల్పోవడం వల్ల జనజీవనం స్తంభించడం జరిగింది. అంతే కాకుండా ప్రజలకు మృత్యువు విచిత్రంగా ఉంటుంది. అధికంగా విపత్తులు ఏర్పడతాయి ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉంటుంది అనేది అర్థం అవుతోంది. దాని ప్రకారమే అందరూ అనుభవించారు అనుభవిస్తున్నారు కూడా....
భారతదేశం గురించి విశేషంగా చెప్పాలంటే మనది ఒక గొప్ప దేశం. ముఖ్యంగా ఆధ్యాత్మికత పొందిన దేశం. ఆధ్యాత్మికత ఎక్కువగా మన దేశంలో వుండటం చేత గ్రహ ప్రభావం అంటే, వాస్తవికంగా చెప్పాలంటే ఎప్పుడైతే బృహస్పతి వక్రించడం శని వక్రించడం లాంటివి జరిగాయో వీటివల్ల మనకు ప్రజా నష్టం ఎక్కువుగా జరగకుండా కాపాడింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే కేతువు ధనస్సులో కుజుడు గురువు కేతువులను వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం, సూర్యుడు కూడా మారడం వల్ల తగ్గుముఖం పడుతుంది అనేది కనబడుతోంది. దీనివల్ల కొంత ప్రశాంతతను ఇస్తుంది. మార్చి ౨౯, ౩౦ తేదీల్లో కేతువుని గురువు కూడా వదిలి పెట్టడం వల్ల కేతువు ఒంటరి వాడయ్యాడు. దీనితో జనాలలో కొంత అవగాహన పెరగడం, కొద్దికొద్దిగా వైరస్ తగ్గినట్లు అనిపించినా కూడా భయాందోళనలు పూర్తిగా ఇది నిర్మూలన అనేది జరగదు. ఆ తరువాత మనకి ఉగాది నాటి నుండి ఒకసారి గ్రహాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మార్చి ౨౫న ఉగాది ఏర్పడింది. శార్వరి అంటే చీకటి అని మాత్రమే అందరికీ తెలిసింది. కానీ చీకట్లను పారదోలడానికి భగవంతుడు ఎలా వస్తాడో కూడా ఇందులో చెప్పాడు. శార్వరిలో చీకటిమయం కాబోతున్న ఈ సంవత్సరంలో మన దేశం ఆధ్యాత్మికతతో కూడిన దేశం కనుక మనల్ని రక్షించడానికి పెరుమాళ్ శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చాడో ఈ శార్వరిని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.
ప్రశ్న:- ఈ సంవత్సరంలో చాతుర్గ్రహ, పంచ గ్రహ, షడ్గ్రహ కూటములు ఎన్ని ఉన్నాయి? వాటి ప్రభావమేమిటి?
సమా:- ఈ శార్వరీ నామ సంవత్సరంలో ౧౦ సార్లు చాతుర్గ్రహ కూటములు, ౪ సార్లు పంచ గ్రహ కూటములు, రెండు సార్లు షట్ గ్రహ కూటములు ఉన్నాయి. కొన్ని ఏర్పడ్డాయి, మరికొన్ని ఏర్పడబోతున్నాయి. వాటివల్ల అనేక రోగపీడలు, పరస్పరము రాజులు కలహించుకోవడం అలాగే వాయుపీడ, దాంతో పాటుగా మంచి వర్షాలు కనిపించినా దాని వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం లాంటివి ఉంటాయి.
ఒకసారి ఆ తేదీలను పరిశీలిద్దాం...
ధనుస్సులో బృహస్పతి ఉంటే...
వీత రోగ భయాస్సర్వే చాపస్ధే దేవ పూజితే
హృదయానందినీ ధాత్రీ పరశాలీ సువృష్టిభిః
సమస్త జనులు రోగం లేక మంచిగా ఉంటారు. వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. మకరంలో బృహస్పతి వచ్చినప్పుడు...
అసత్ప్రభో జనాధాత్రీ పూర్ణ సస్యానువృష్టిభిః
వీత రోగ భయాస్సర్వే మకరస్ధే సురార్చితే
ఇది మరొక ప్రమాణం. సకల జనులు శత్రు రోగ భయ రహితులై ఉంటారు. సువృష్టి చేత భూమి సస్యశ్యామలమై ఉంటుంది. కుంభంలోకి బృహస్పతి వస్తే...
బృహస్పతే కుంభగతే ధరిత్య్రాః కుంభాభిషేకాశ్చ శివాలయేషు
భద్రాసనారోహణ మంగళాప్తిర్మహీ భుజాం శూద్రజనో చ్ఛ్రయస్యాత్
అని శివాలయములో కుంభాభిషేకములు జరుగుతాయి. రాజులు సింహాసనం ఎక్కుతారు. శూద్రులు గొప్ప స్థితికి వస్తారు అని ఒక ప్రమాణం. కానీ ఇక్కడ ఈ సంవత్సరం ముఖ్యంగా బృహస్పతి, శని వక్రించి ఉండటం చేత శని వక్రారంభం అయిన తరువాత అది ద్విగుణీకృతం త్రిగుణీకృతం అయింది ఈ వైరస్. బృహస్పతి వక్రించినప్పటికీ కూడా మన భారతదేశంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక బలం కలిగి ఉండటం చేత ప్రధానమైన ప్రజా నష్టం పెద్దగా జరగకుండా కాపాడింది. గురువు వక్రించి ధనస్సులో కేతువుతో కలవడంతో జూలై ౧నుండి వ ురింత విజృంభిస్తోంది.
ప్రశ్న:- ఈ కరోనా అంతమయ్యేది ఎప్పుడు?
సమాధానం:- రేపు ౧౩.౯.౨౦౨౦న గురువు త్యాగం అవుతున్నాడు అంటే తదుపరి వ్యాక్సిన్ లాంటి ఔషధం రావచ్చు. అలాగే ౨౯ సెప్టెంబర్ శని వక్ర త్యాగం కనుక ఈ కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతుంది అని తెలుస్తోంది. అలాగే ౧౮ నవంబర్ కేతువు ధనస్సు వీడి వృశ్చికానికి వెెడుతున్నాడు. ఆ వెళ్లడం చేత ఈ కరోనా వ్యాధి దానంతట అదే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. దాని కంటే ముందుగా ఇంకా చూస్తే మనకి రేపు అధిక ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి ౨౪ సెప్టెంబర్ నుండి దీని తగ్గుముఖం పట్టి ఒక ఔషధం కనిపించే అవకాశం విశ్వాసంతో పూర్తిగా మనం చెప్పడానికి ఆస్కారం ఉంది.
ప్రశ్న:- ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలాంటి వైదిక కర్మలను ఆచరించాలి?
సమాధానం:- కాలచక్రంలో ఉపద్రవములు ఏర్పడ్డప్పుడు అద్భుత శాంతులు చేయటానికి ఒక ప్రక్రియ ఉంది. అది మనకి స్పష్టంగా ఋష్యాదులు లాంటి పెద్దలు మనకు అనుగ్రహించారు. షష్ఠ గ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?
చాతుర్గ్రహ కూటములు బాగా ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?
పంచ గ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?
అనేది ఈ ప్రాయశ్చిత్త కాండలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా అనేక ఉపద్రవాలు ఏర్పడ్డప్పుడు, జగత్తుకి సంక్షోభం ఏర్పడ్డప్పుడు అద్భుతశాంతి జరిపినట్టుగా మనకి ఒక ప్రమాణం కూడా కనబడుతోంది.
ప్రశ్న:- మరి దీన్ని గతంలో ఎవరైనా ఎప్పుడైనా ఆచరించారా?
సమాధానం:- భృగువు అనే మహర్షి పూర్వం ఆచరించాడు అని ఉంది. శ్రీ మహావిష్ణువుకి ౨ పాదములు - మూలా నక్షత్రం. ౨ పిక్కలు - రోహిణి నక్షత్రం. ౨ మోకాళ్ళు - అశ్విని నక్షత్రం. ౨ తొడలు - పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు. ౨ పృష్ఠము - పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు. నడుము - కృత్తికా నక్షత్రం. ౨ పార్శ్వాలు - పూర్వాభాద్ర ఉత్తరాభాద్రలు. ఉభయ కుక్షి - రేవతి నక్షత్రము. వక్షస్థలం - అనురాధ. పృష్ఠ ప్రదేశం - ధనిష్ఠ. ౨ భుజములు - విశాఖ. ౨ చేతులు - హస్త. వ్రేళ్ళు - పునర్వసు. గోళ్ళు - ఆశ్రేష. కంఠము - జ్యేష్ఠ. చెవులు - శ్రవణం. ముఖము - పుష్యమి. దంతము - స్వాతి. దవడలు - శతభిష. ముక్కు - మఖ. నేత్రములు - మృగశిర. లలాటమ - చిత్త. శిరస్సు - భరణి. జుట్టు - ఆర్ద్ర. ఇలా శ్రీమహావిష్ణు స్వరూపాన్ని వర్ణించబడిఉంది. దీన్ని నక్షత్ర పురుషము అంటారు. ఈ నక్షత్ర స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపము అనీ, దీన్ని జగత్ సంక్షోభము ఏర్పడినప్పుడు అద్భుత శాంతి ప్రక్రియగా భృగుమహర్షి ఆచరించాడు. అని ఇలాంటి నక్షత్ర స్వరూప శ్రీమహావిష్ణు యాగం ఆచరిస్తే సర్వపాతకములు నశిస్తాయి. సప్త జన్మలలో జరిగిన పాతకములూ నశిస్తాయి. కుల సాంకర్యం వలన వచ్చింది కానీ, లేదా తల్లిదండ్రుల వలన వచ్చినదైనప్పటికీ కూడా దాన్ని ఉపశమింపచేస్తుంది. దీని వలన చక్కని రూపం కలుగుతుంది. సర్వశుభాలు కలుగుతాయి. ఉత్తమమైన శరీర ఆరోగ్యం కలుగుతుంది. అంతులేని మనస్సంతృప్తి కలుగుతుంది. చక్కని వాక్ మాధుర్యం కలుగుతుంది. కాంతి ఏర్పడుతుంది. ఉత్తమమైన జాతి ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైనది. ధన్యమైనది. శ్రేయోదాయకమైనది.