My site provides Vastu and Jathakam ....

Tuesday, 23 January 2018

రథ సప్తమినాడు ఏంచేయాలి


రథ సప్తమినాడు గుమ్మం ముందు 'రథం ముగ్గును' వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి, దాని పైన మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. పాలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. సూర్యుడి చిత్రపటానికి అలంకరణ చేసి పూజించాలి. సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి, సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. సూర్య నమస్కారాలు చేయాలి .  రథ సప్తమినాడు స్నాన దాన అర్ఘ్యాలు కోటి రెట్లు పుణ్యం ఇస్తుంది. జాతకంలో రవి దశ జరుగుతున్నవారు, జాతకంలో రవి బాగులేని వారు, రోగ బాధలు అనుభవిస్తున్న వారు ఈ రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి చెంబు లో గోధుమలు పోసి బ్రాహ్మణునికి దానం చేయాలి. అయితే ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం చేయడం ఉత్తమం 
 సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్ ||
108 మార్లు పారాయణం చేయాలి.
 
అదిత్య హ్రుదయం పారాయణం చేయాలి 

Friday, 19 January 2018


 మాఘ మాస విశిష్టత


మాఘ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియ, తదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూశిష్టత జ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు.

ఈ చవితికే తిలచతుర్ధి అని పేరుంది. ఈ రోజు ప్రత్యేకంగా నువ్వులను దానం ఇవ్వటం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.

మాఘ శుక్ల పక్ష పంచమి నుండి వసంత ఋతువు ఆరంభమవుంటుందనే  వసంతోత్సవము జరుపుతారు. అయితే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాల్చు కాలాన్నిశిశిర ఋతువుగా పరిగణిస్తారు వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. కానీ  శిశిర ఋతువు ప్రారంభమైన ఐదవ రోజు మాఘ పంచమి నుంచి పరోక్షంగా వసంత ఋతువు ప్రారంభం ఐనట్టు పండుగలు జరుపుకుంటాము. ఈ నేపథ్యంలోనే సృష్టియొక్క యౌవనం వసంత ఋతువు.మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమి (శ్రీ పంచమి)
పర్వదినం వస్తుందనే వాదనవుంది .ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు.
వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేసిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు తెలుపుతారు.
సరస్వతిని పూజించిన వారికీ విద్య అబ్బుతుందని విశ్వసిస్తారు.  ఈ రోజు ఆంజనేయుని పూజిస్తే విద్య వస్తుందని నమ్ముతారు.
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూర్త్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్

అలాగే రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల వసంతుడు సంతోషిస్తాడని ప్రతీతి  . అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు.

శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.

శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమ నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం.

నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశిని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు.

ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు.

కృష్ణ ద్వాదశినాడు తిలర్వాదశీ వ్రతంజరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగాపేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.