ఆండాళ్ ఆరాధన
ధనుర్మాసం అంటే ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం మన సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
ఆండాళ్ తల్లి ఆరాధన, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని అంటారు. ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారికి ఆండాళ్ తల్లి అనుగ్రహం కలుగుతుందని విస్వాసం. వేదమనైతుక్కుంవిత్తాగుం అంటారు తిరుప్పావై అంటే వేదమంతటికి మూల బీజము . ఈ తిరుప్పావైలోని ముపై పాశురాలు నాలుగు వేదాలలోని సారము. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. అమ్మకటాక్షం కలిగితేనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. భూదేవియే శ్రీ ఆండాళ్తల్లిగా అవతరించి తిరుప్పావై మన కందించింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం.
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో గోదాదేవి స్వామిని కీర్తించేది. మనలో ఎన్ని దోషాలున్నప్పటికి వాటిని తొలగించిపరమాత్మను చేరుకోవడానికి ధనుర్మాస అనుగ్రహిస్తున్నాడు.
అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయి. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాస వ్రతంతో ఆతల్లి మనందరిలో ప్రేమను నింపి ఆ ప్రేమ పాశముచేతభగవంతునిచే బంధించే ఉపాయాన్ని అనుగ్రహించింది. మాసానాం మార్గశీర్షం అని చెప్పుకున్న పుణ్యకాలము భగవత్ ప్రాప్తి కొరకు శరణాగతిని ఉద్బోదించే పరమ పవిత్రకాలము ఈ ధనుర్మాసము.
-
*యాజ్ఞికదర్శిని అంతర్జాల పత్రికలో ప్రచురించిన వ్యాసం*