My site provides Vastu and Jathakam ....

Monday, 6 April 2026

గ్రహమాలిక అంటే ఏమిటి? ఎవరికి లాభం? లాభం పొందే రాశులు

 గ్రహగమనాలు మానవుల జీవితంపై ప్రభావాలు చూపుతున్నాయన్నది వాస్తవం. కొన్ని మార్లు ప్రయోజనాలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. గ్రహమాలిక గురించిన విషయాలు చాలావరకు పరిగణనన తీసుకున్న సందర్భాలు తక్కువ. జన్మకాల దశలో మాత్రమే ఈ ప్రభావం ఎక్కువ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. జన్మకాల దశ అనంతరం ఈ ఫలాలు వారివారి నక్షత్రాలు స్థానాలను అనుసరించి ఉంటాయి. గ్రహమాలిక గురించి తన రచనలలో వరాహమిహురుడు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ bందుకు అని అనిపించవచ్చు. ఈ నెల పూర్ణిమ తరువాత పాడ్యమి నాటి నుండి కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కుంభం, మీనం,  మేషములలో రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల గ్రహమాలికా స్థితి కనిపిస్తుంది. ఇదే వరుసలో మిధునం కర్కాటకంలలో వరుణ, గురు గ్రహాలు కూడా ఉన్నాయి. ఆధునికులు వరుణ ఇంద్ర యమ గ్రహ ప్రస్తావన కూడా అప్పుడప్పుడు తమ గణన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వరుణ (యురెనస్) మిధునంలో, గురువు కర్కాటకంలో సంచారం చేస్తున్నాయి. ఈ గ్రహమాలికలో కుంభంనుంచి కర్కాటకం వరకు రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల, వరుణ, గురు గ్రహమాలికగా కనిపిస్తున్నాయి. ఆరు లేదా ఎనిమిది గ్రహాల ఈ మాలిక వల్ల కొన్ని రాశులవారికి అద్భుత యోగాలు, లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహగమనాలను మాలికా స్థితిని విశ్లేషించే సిద్ధాంతులు ఈ విషయాలను మరింత స్పష్టంగా చెప్పగలరు. 

ప్రస్తుతం శుభ వీక్షణ, ముఖ్యంగా గురు గ్రహ చూపు గ్రహమాలికపై కనిపించడం విశేషించి ఫలితాలను విశ్లేషించవచ్చు.

గ్రహమాలిక జాతకంలో ఒక ముఖ్యమైన యోగం. ఇది ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగలదు. ఇది ఎలా పనిచేస్తుందో మీ జాతకంలోని ఇతర గ్రహస్థితులపై ఆధారపడి ఉంటుంది.

గ్రహమాలిక అంటే ఏమిటి?

జాతక చక్రంలో గ్రహాలు వరుసగా (క్రమంగా) కొన్ని రాశుల్లో ఉండి ఒక “మాల” లాగా ఏర్పడితే దాన్ని గ్రహమాలిక అంటారు. ఉదాహరణకు 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు వరుసగా రాశుల్లో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది.

గ్రహమాలిక వల్ల లాభాలు

గ్రహమాలిక యోగం బలంగా ఉంటే.. జీవితం లో స్థిరత్వం వస్తుంది. సంపాదన మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వ, పబ్లిక్ రంగంలో పేరు, ప్రతిష్ట రావచ్చు. నిర్ణయ శక్తి  బలంగా ఉంటుంది. ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. 

ఇక్కడ మరో విషయం గమనించాలి. ఎప్పుడు ఫలితం తగ్గుతుంది? అన్న విషయాలను పరిగణన చేయాలి. వాస్తవంగా పరిశీలిస్తే ... ఇలా ఉంటే ఫలితాలు తగ్గవచ్చు. పాపగ్రహాలు (శని, రాహు, కేతు, కుజుడు) ఎక్కువగా ఉంటే అవి నీచస్థితిలో ఉంf,ñ ముఖ్య గ్రహాలు బలహీనంగా ఉంటే, ప్రస్తుతం వివిధ వ్యక్తుల జాతక చక్రాలలన పరిశీలించి వారి దశ-భుక్తి బలంగా లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. 

కుంభ  మీన  మేష రాశుల్లో రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల గ్రహమాలిక స్థితి ఒక ముఖ్యమైన గోచార యోగం. ఇది సాధారణంగా అందరికీ ఒకేలా ఫలితం ఇవ్వదు.  పైన ఉదహరించినట్లు రాశి, లగ్నం, దశలపై ఆధారపడి మారుతుంది.

ఎవరికి లాభం?

అయితే సామాన్యంగా ఎవరికి లాభం ఎక్కువగా ఉంటుందో ఇలా చూడొచ్చు 

ఎక్కువగా లాభం పొందే రాశులు

1. మేష రాశి ఈ గ్రహమాలిక మీ రాశికి దగ్గరగా ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఎదుగుదల, ధైర్యం, చక్కని నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది

2. కుంభ రాశి: గ్రహాలు ఈ రాశి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఆర్థిక లాభాలు, నెట్‌వర్క్, ఫ్రెండ్స్ ద్వారా అవకాశాలు,దీర్ఘకాల ప్లాన్లు సక్సెస్ అవుతాయి.

మీన రాశి మధ్యలో ఉన్నందున మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఎదుగుదల, విదేశీ అవకాశాలు, కొత్త ప్రయోజనకరమైన ఆలోచనలు రావచ్చు. మార్గాలు సుగమం అవుతాయి. 

మిశ్రమ ఫలితాలు ఇచ్చే రాశులు

వృషభ, మిథున, తుల, ధనుస్సు రాశుల వారికి కొన్ని విషయాల్లో లాభం, కొన్ని చోట్ల ఆలస్యం, కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది.

జాగ్రత్త అవసరం ఉన్న రాశులు

కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర రాశులవారికి ఒత్తిడి, ఖర్చులు పెరగడం, ఆరోగ్యం, సంబంధాల్లో జాగ్రత్త. త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. 


Sunday, 5 April 2026

బ్రహ్మజ్ఞానం - బ్రాహ్మణుడు

 జన్మనా జాయతే శూద్రః

సంస్కారాత్ భవేత్ ద్విజః

వేదపాఠాత్ భవేత్ విప్రః

బ్రహ్మజ్ఞానాత్ ఇతి బ్రాహ్మణః


మానవుడు తన జన్మచేత శూద్రుడు మాత్రమే. వానికి తండ్రి వడుగు చేసినంత, ద్వితీయజన్మనొందిన వాడై ద్విజుడౌతాడు. వేదం నేర్చుకొనిన అనంతరం విప్రుడౌతాడు. అతడు బ్రహ్మజ్ఞానం తెలుసుకొనిన అనంతరమే బ్రాహ్మణుడౌతాడు. అంతేకానీ, పుట్టుకతో బ్రాహ్మణుడెవరూ కాదు.

Tuesday, 24 January 2023

మేలు చేసే శనీశ్వరుడు

జ్యోతిష్యం ఒక శాస్త్రం దీనిని చక్కగా అవగాహన చేసుకుంటే ప్రయోజనాలు ఎన్నో సిద్దిస్తాయి. నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలు భవిషత్తు, వర్తమానం తెలుసుకోడానికి అవగాహన కలిగించుకోడానికి జ్యోతిష్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. పన్నెండు గ్రహాల గమనం మనవ జీవనాన్ని నడిపిస్తాయి ప్రభావితం చేస్తాయి. సహజంగా జరుగుతున్న సంఘటనలకు అతీతంగా రాగద్వేషరహితంగా ముందుకు వెళుతున్నవారికి గ్రహాలు వాటి గమన సమయంలో ప్రతికూల ఫలితాలు ఇచ్చే సమయంలో సైతం పైన ఉదహరించినవారికి అనుకూలంగా ఫలితాన్ని ఇస్తాయి. వారిపై తమ ప్రతికూలతను ప్రదర్శించలేవు.
ముఖ్యంగా నడవడికను అనుసరించి ప్రవర్తిస్తున్న విధానాలను అనుసరించి వెంట వెంటనే ఫలితాలను మనముందు ఆవిష్కరించే గ్రహం శని. శనేశ్వరుడు అను కూడా వ్యవహరిస్తాము. నవగ్రహాలలో శని మినహా మరే గ్రహాన్ని (శని G ఈశ్వరుడు) శనేశ్వరుడు అని పిలువము. ఎందుకంటే ప్రతి 30 సంవత్సరాల కాలంలో శని ఏడున్నర సంవత్సరాలు వరుసగా ఫలితాలను ఇస్తూనే ఉంటాడు. ఆ ఫలితాలు అన్నవి నడవడికపైన ఆధారపడటం అన్న విషయం ఆలోచనలకు అందని విషయం.
జ్యోతిష్య విజ్ఞానాన్ని ఒక వ్యాపారంగా ఉపయోగిస్తున్న ఈ రోజులలో వాస్తవాన్ని అందరిముందు ఆవిష్కరించాలన్న చిరుప్రయత్నం ఇది. విజ్ఞానరహస్యాలను అందరికీ తెలియాలన్నదే నాప్రయత్నం కానీ మరొకరిని కించపరచాలన్న ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదన్న విషయం గమనించి లోతుగా పరిశీలించి ప్రయోజనం పొందాలని నా విజ్ఞాపన. ముఖ్యంగా సాడే సాత్‌ శని గురించి నాముందుకు వచ్చిన విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని తగు విధంగా స్పందించాను. మరింత లోతుగా సమాధానాలు కావాల్సిన వారు నేరుగా స్పందిచవచ్చు. తగు సమాధానాలు పొందవచ్చు.
ఒక సందర్భంలో ఆపదవచ్చిన తరువాత దానిని తప్పించుకునే ప్రయత్నంలో దైవాన్ని ఆశ్రయించడం, పూజలు, హోమాలు చేయడం సర్వ సాధారణం. దీనివల్ల కాస్త ఉపశమనం మాత్రమే దక్కుతుంది. వర్షంలో వెళుతున్నప్పుడు గొడుగు పట్టుకుని వెళ్లిన చందంగా ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం కన్నా ముందు జాగ్రత్త పడితే జరిగే మేలు ఎక్కువ!
పెను ప్రమాదాలు, మృత్యుగండాలు సైతం ముందుగా చేస్తున్న గో పూజలు దానాలు, ధర్మాలు వల్ల అధిగమించవచ్చు. అయితే అది ప్రమాదమని మనం తెలుసుకునే అవకాశం లేదు. కానీ శనీశ్వరుడు పన్నెండు రాశులలో గమనం చేస్తున్న సమయంలో ఏరాశిలో ఉన్నాడో ఆరాశి, ఆరాశికి ముందు వెనుక ఉన్న రాశులు సాడే సాత్‌ శని ఉన్నట్లుగా జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
సాడే సాత్‌ శని అంటే ఏమిటి ? దీని వలన సమస్యలు వస్తాయా? నివారణ చర్యలు ఉన్నాయా ? అన్న ప్రశ్నలు మన ముందు కనిపిస్తాయి. నవ గ్రహాలలో ‘శని గ్రహం’ ఒకటి. శని సూర్యుని పుత్రుడు. అయినా జ్యోతిష్యంలో శని సూర్యుడికి శత్రువనే చెబుతారు. సాడే సాత్‌ శని అంటే ‘‘ఏడున్నర సంవత్సరాల కాలం శని’’ అని అర్థం. దీనినే ఏల్నాటి శని అని కూడా అంటారు. ప్రతి జాతకుడికి ఇది అత్యంత కష్ట కాలం అని చెబుతారు. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి జాతకుడి జీవిత కాలంలో శని సంచారం అనేది కనీసం 2 పర్యాయాలయినా వస్తుంది. సాధారణంగా ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాలు శని ఉంటుంది. ఆ విధంగా 12 రాశులు తిరిగి రావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇది సహజంగా ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చేదే. ఎవరూ దీని నుండి తప్పించు కోలేరు. శని అన్ని సార్లు., అందరికి చెడు మాత్రమే చేస్తాడనుకోనవసరం లేదు. మంచి చేసే సందర్భాలు కూడా ఎక్కువే. శని కష్ట జీవి. శ్రామికుడు. మన చేత కష్టాలను చూపిస్తాడు. కష్టానికి తగ్గ ఫలితాలను చూపిస్తాడు. అందుకని శని దశాలకైనా., ఏల్నాటి శనికైనా., అర్దాష్టమ., అష్టమ శనికైనా భయపడ కూడదు. ఏ గ్రహ సంచారం ఆ గ్రహం చేసుకుంటూనే పోతుంది. కర్మఫలాన్ని మనం చూస్తూ అనుభవించాలి., ఆస్వాదించాలి తప్పా భీతిచెంద కూడదు. దేన్ని నమ్మినా నమ్మక పోయినా గ్రహాల శక్తిని అందరూ ఒప్పకుంటారు. ఎందుకంటే మనకు ప్రతి రోజూ గ్రహాల శక్తి గురించి కళ్లారా చూస్తున్నాం. అనుభవిస్తున్నాం. ప్రతి రోజూ సూర్యుడు., తూర్పు దశ సరైన సమయానికి ఉదయిస్తాడు. మనమూ లేస్తాం. సాయంత్రం కరెక్ట్‌ సమయానికి అస్త మిస్తాడు. అలాగే మిగిలిన గ్రహాల గమనాలు ఉంటాయి. పన్నెడు రాశులలో వాటి సంచార కాలంలో పరస్పరం కలహించుకుంటాయి. అనుకూలంగా వ్యవహరించుకుంటాయి. అనుకూల, ప్రతికూల సమయాలను అనుసరించి సమస్యలు ఎదురవుతాయి. మంచిపనులు జరుగుతాయి.
ఏల్నాటి శని దోష నివారణకు, శాంతికి వేల రూపాయలను మరెవ్వరికో దోచి పెట్ట నవసరం లేదు. వైరాగ్యానికి., నిరాశ, నిస్పృహకు గురికాకుండా స్పందించాలి. భయ పడవలసిన అవసరం అంతకూ లేదు. కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ముందుగానే కొంత అవగాహన తెచ్చుకుని., ఎవరికీ వారే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
ఈశ్వరునికైనా శనీశ్వరుని బాధ తప్పలేదని పురాణ ప్రవచనం. పెద్దలు చెప్పగా వింటున్నాం శని ఎలా పడుతుందో చూస్తా అని పోయి చెట్టు తొర్రలో లేదా నీటి మడుగులో దాక్కున్నాడట.
వాస్తవానికి వస్తే అవి కథలని కొట్టిపారేయలేం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రారబ్ధ కర్మల నుంచి ఎవ్వరూ తప్పించు కోలేరు. ప్రారబ్ధ కర్మలు ఇవి విడిచిన బాణం లాంటివి అని వచ్చే సమస్యలను ఎవరూ తప్పించ లేరు. నివారణోపాయాలు మన జీవన మార్గలో అన్వేషించాలి. భగవత్‌ భక్తి, గో సేవ కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. మంచి ఆలోచన చక్కని మార్గం చూపే అవకాశం ఉంది. ప్రతి జాతకుడి జీవితంలో కనీసం రెండు సార్లు సాడే సాత్‌ శని వస్తుంది.
ముఖ్యంగా నిజాయితీగా డబ్బు సంపాదించి పొదుపు., క్రమశిక్షణ గల వారికి గర్వం ఉండదు. వినయ విధేయతలు కలిగి ఉంటారు. దాన గుణం ఉంటుంది. ప్రేమాభి మానాలు ఉంటాయి. నలుగురితో అనుబంధాలుంటాయి. సత్సంభందాలుంటాయి. భక్తి భావాలు ఉంటాయి. అన్నిటికి మించి మంచి ఏదో చెడు ఏదో వీరికి బాగా తెలిసి ఉంటుంది. ఆరోగ్యం పై మంచి శ్రద్ద ఉంటుంది. అన్నిటికి కావాల్సింది డబ్బు. సరి పడా డబ్బు కూడా పొదుపు చేసుకునే ఉంటారు. ఇన్ని సుగుణాలు ఉన్న వీరిపై శని ప్రభావం ఎంత మాత్రం కన పడదు.
‘సాడే సాత్‌ శని’ ప్రభావం ప్రతీ సారి, ఒకే సారీ మూడు రాశులపై ఉంటుంది. ఈ ఏడున్నర సంవత్సరాలు ఏల్నాటి శని అంటారు. ప్రస్తుతం కుంభ రాశిలో శనీశ్వరుడు ఉన్నారు. దాని ప్రభావం., దాని ముందు రాశి అయిన. మీనంలోను., అలానే దాని వెనుక రాశి అయిన మకర రాశిలో సాడే సాత్‌ శని ఉంది. మరో విధంగా చెప్పాలంటే జాతకుడి రాశి నుండి లెక్క బెడితే 12,1,2వ స్థానాలను సాడే సాత్‌ శని గా చెప్పుకోవచ్చు. 4 ను అర్దాష్టమ శనిగా మరియు 8 వ స్థానాన్ని అష్టమ శనిగా చెబుతారు. ఇది జాతకునికి గడ్డుకాలం. భక్తి శ్రద్ధలతో, నిజాయితీగా వ్యవహరించినవారికి పరిహారం లభిస్తుంది. నిర్లక్ష్యం చేసినవారు ఇబ్బందులు అనుభవించక తప్పదు.
17 జనవరి 2023 నుండి సాడే సాత్‌ శని ప్రభావం కుంభ రాశి లోను., దాని ముందు రాశి అయిన మీనం రాశి లోను మరియు దాని వెనుక రాశి అయిన వృచ్చిక రాశి అర్దాష్టమ శని, కర్కాటక రాశివారి అష్టమ శని ప్రభావం ఉంటుంది.
శని అనేది శక్తి వంతమైన గ్రహం. ఒక్కో స్థానంలో ఉన్నపుడు ఒక్కో ప్రభావాన్ని చూపెడుతుంది. కొన్ని గ్రహాలతో కల్సి ఏ రాశిలోనైతే సంచరిస్తుందో ఆ రాశి జాతకులపై., అధిక శని ప్రభావం ఉంటుంది. ఆయా రాశులలో గ్రహసంచారం ఆధారంగా మంచీ, చెడు ఫలితాలు ఉంటాయి. సాడే సాత్‌ సమయంలో మేలు జరుగుతున్న సందర్భాలు ఉంటాయి. ఆయా సమయాలలో గ్రహగమనాలను గమనిస్తేకాని వాస్తవం గోచరం కాదు.
చంద్రస్థిత రాశి స్థానం నుండి లెక్కించి నపుడు 12, 1, 2, 4 మరియు 8 వ స్థానంలలో శని సంచారం జాతకుడికి అత్యంత ప్రమాద కరమైనటు వంటి సమయంగా పరిగణిస్తారు. చాలా కాలంగా శాస్త్ర పరిశోధనలు చేసినవారు ముందు జాగ్రత్తగా చెబుతారు. ఆవిషయాలను అవగతం చేసుకుని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంతకూ సాడే సాత్‌ శని వలన ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందో జ్యోతిష్య పండితులు పలు సందర్భాలలో ఉటంకించారు. ఆవిషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. సమస్యలు ఎలా ఉన్నా నివారణ ఉపాయాలు కూడా ఉన్నాయి.
‘సాడే సాత్‌ శని’ గురించి పూర్తిగా అవగాహన పెంచు కోవాలి. ప్రస్తుతం కుంభరాశికి ముందు వెనక రాశులలో సాడే సాత్‌ శని నడుస్తుంది. జాతకుల రాశి నుండే ఎవరికీ వారే 12, 1,2, 4, 8 వ రాశులను లెక్క పెట్టు కోవచ్చు. నివారణ చర్యలను చేపట్ట వచ్చు. ఆర్ధికంగా బలంగా ఉంటే సాడే సాత్‌ శనిప్రభావం పెద్దగా మన మీద కన బడదు . ఎప్పటి నుండో ఉన్న దీర్ఘ రోగాలకు ., సమస్యలకు ‘ సాడే సాత్‌ శనే ‘ కారణం అని భయ పడ నవసరం లేదు. ఓపికను పెంచు కోవాలి. కోపాన్ని తగ్గించు కోవాలి. పూర్తి సమా చారం వచ్చిన తరువాతనే జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రశాంతంగా ఉండటం మెల్ల మెల్లగా అలవరచు కోవాలి. వత్తిడిని ., అధిక పని భారాన్ని తగ్గించు కోవాలి. తొందర పాటుతగదు.
ఏకాగ్రత మెడిటేషన్‌ అలవరచు కోవాలి., సరి పడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
సర్దుబాటు ధోరణి అలవరచుకోవాలి. సమస్య అధికంగా కన బడితే., సాడే సాత్‌ శని కాలంలో., శని గ్రహ పూజను ప్రతి శని వారం చేయడం గొప్ప నివారణ చర్య అవుతుంది. పూజ చేయు నపుడు శని గ్రహం మీద ఒక నల్లని కొత్త బట్టను కప్పి., దానిపై మెల్లగా ఒక లీటర్‌ నువ్వుల నూనెను పోయాలి. నల్లటి నువ్వుల గింజలను తీసుకుని మెల్లగా శని గ్రహంపై జార విడువాలి. ఆ తరువాత శని గ్రహం చుట్టూ ప్రదక్షణలు చేయాలి.
కిలోమ్బావు నల్ల నువ్వులను తీసుకుని., మీటరుంబావు నల్లగుడ్డను., ఒక ముక్క నల్ల బెల్లం., ఒక ఇనుప మొలను మరియు రూపాయి లేదా రెండు రూపాయల బిళ్ళ కల్పి ఏదయినా గుడిలో ఒక నల్ల పూజారికి శని వారం దానం చేయాలి.
శని గ్రహ మంత్రాన్ని పఠించాలి.
శివ పంచాక్షరీ, మహా మృత్యుంజయ మంత్రాలను పఠిస్తూ పూజించాలి.
పక్షులకు ముఖ్యంగా కాకులకు ధాన్యాలను వేయాలి.
నల్ల చీమలకు చక్కెరను గాని., తేనె ను గాని తినిపించాలి.
ప్రతినిత్యం శని మంత్రం పఠించాలి.
రామాయణ కాలంలో దశరథుడు పఠించిన శని స్త్రోత్రాన్ని పఠించాలి.
హనుమాన్‌ చాలీసాను ప్రతి రోజు పఠించాలి.
ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే విధంగా చూసు కోవాలి. ఎదో ఒక వ్యాపకం లో నిమగ్న మవ్వాలి.
ప్రతి రోజు కనీసం 3 సార్లు నీలాంజనం సమా భాసం., రవి పుత్రం యమా గ్రజం., ఛాయా మార్తాన్ద సంభూతం., తం నమామి శనైశ్చరం’’ అని పఠించడం వలన శని గ్రహన్ని శాంతింప చేయవచ్చు.
మంచి చేసినా చెడు చేసినా దానికి వలసిన కర్మ ఫలాన్ని అనుభవించడానికి తగు యోగ్యమైన కాలంగా శనేశ్వరుడు సంచరించే ఏడున్నర సంవత్సరకాలంలో నిర్ణయిస్తాడు. వారి వారి ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా పనిచేసేలా వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో మన ముందు ఆవిష్కరిస్తారు. అయితే ఈ ఆవిష్కరణ సమయంలో మానవులు నడుచుకుంటున్న వ్యవహారాల శైలిని అనుసరించి కొన్ని పనులను చేసే సమయంలో వాటికి వల్ల ఎదురయ్యే ఫలితాలను మనం మానవులు అనుభవించక తప్పదు.
సాధారణంగా మానవులందరూ ఒకే రకంగా ఉండరు న్యాయాన్ని విచక్షణ కూడా తరు పాటించరు ఈ విధానాన్ని అనుసరించే వారి వారి కి ఇబ్బందులను కలిగించడం కర్మ ఫలాన్ని అనుభవించేలా చేయడం భగవంతుని గుర్తుచేయడం లాంటివి తార్కికంగా జరుగుతాయి. అసలు జీవితంలో ఒడిదుడుకులు లేని సమయం అంటూ ఉండదు మంచి కాలం వచ్చినప్పుడు ఇది తమ గొప్ప అని భ్రమ పడటం కూడా జరుగుతుంది. వాస్తవాలను మనం బేరీజు వేసుకున్నప్పుడు మంచి చెడులను కూడా వేసుకోవాలి కర్మ ఫలాలు అనుభవయోగ్యంగా మలుచుకునే నైపుణ్యం మనిషికి శనీశ్వరుడు ఇచ్చాడు. వారు ప్రతి సమయంలో ఎదుటివారి క్షేమాన్ని కాంక్షిస్తూ నడుచుకున్న వారికి సాడే శాస్త్ర సమయంలో కానీ అర్దాష్టమ సమయంలో కానీ అష్ట మా సమయంలో కానీ శని వల్ల ఎలాంటి అపకారం జరగదు కానీ ఆయా సమయాల్లో వారికి ఆర్థికంగా పుంజుకునేలా శనీశ్వరుడు తోడ్పడతాడు. ఆ సమయాల్లోనే వివాహ కాలాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా స్థిర, చరాస్తులు కొనుక్కునేలా అందరిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొనేలా చేస్తాడు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే మన మానవులు చేసుకుంటున్న చేస్తున్న కర్మ ఫలాలకు ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు ఎప్పుడు ఏదో రకంగా ఎదుటివారిని మోసం చేసేవారు కొన్ని సమయాల్లో వారు కూడా మోసపోవడం లేదా ఇబ్బందులు పడడం అయితే ఈ ఇబ్బందులన్నీ చాటే సమయంలో చాలా కఠినంగా ఉంటాయి.
నమ్మకం జీవన సాఫల్యానికి విజయానికి తొలిమెట్టు.
అవగాహనకు మరికొన్ని విషయాలు త్వరలో…

Monday, 24 October 2022

వ్యక్తి వికాసానికి విద్య

విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః!
విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీనః పశుః!!
వ్యక్తి వికాసానికి, యోగ్యతకు విద్యకు అధిక ప్రాధాన్యం ఉంది. ‘‘పురుషునికి రూపసమానమైనది, విద్య గలవాడు అందగాడు కాకపోయిననూ దీనికి ఉన్న యోగ్యత ధనానికి ఉండదు. సంరక్షణలో దాచిపెట్టిన ధనమిది. ఈ విద్య భోగ భాగ్యాలనూ, యశస్సునూ, సుఖములనూ ఇస్తుంది. మనకు విద్యనందించు గురువులను తయారుచేసిన గురువులకే గురువు ఈ విద్య. విదేశాలకు వెళ్ళినా కూడా మన బంధు జనుల వలె ఆదరిస్తుంది ఈ విద్య. గొప్పవారితో కూడా పూజించబడుతుంది. అన్ని దేవతల కంటే పెద్ద దేవత ఈ విద్య. ఈ లోకమున అందమైన జీవితమును గడుపుటకు ఉపయోగ పడుతుంది. ఈ విద్య లేనివాడు పశువుతో సమానమే కదా అని కవి హృదయము.’’ అందుకే విద్య ఎక్కడ లభిస్తుందో అక్కడికి పూర్వం విద్యార్ధులు వెళ్ళేవారు. అలా శ్రీరంగానికి, కాశీకి, కాశ్మీరులోని సరస్వతీ పీఠానికి వెళ్లి అధ్యయం చేసినవారున్నారు. సాంప్రదాయ చదువును కోరే మీకోసం ఇదిగో అంటూ మీ ఇంటివద్దకే వచ్చి అంతర్జాల మాధ్యమంగా ‘‘యాజ్ఞికపీఠం వైదిక పాఠశాల’’ చేస్తున్న వైదికసేవలను ఆస్వాదించండి. మరింత మందికి అందించండి.

Tuesday, 2 March 2021

అక్షర ఉచ్చారణ దోష ఫలం

 అక్షర ఉచ్చారణ దోష ఫలం

శ్లోకం:-  అవాక్షర మనాయుష్యం
            నిస్వరం వ్యాధి పీడనం
            అక్షరం శస్త్ర రూపేణ
            వజ్రం పతతిమస్తకే

            (పాణినీయ శిక్ష)
అర్థం:-
ఎవరైతే మంత్రాన్ని అక్షర దోషాలతోగాని, అపస్వరముతో గాని చదువుతారో వారిని ఆ అక్షరమే ఆయుధమై ఆయుష్షు క్షీణించి, వ్యాధి రూపంలో పీడించి, జ్ఞాపకశక్తిని పూర్తిగా నశింపచేస్తుంది అని మనకు   ’పాణినీయ శిక్ష’ లో చెప్పబడింది. అందుకే మంత్రాన్ని గురు ముఖంగా నేర్చుకోవాలి, వల్లించాలి.

Friday, 18 December 2020

కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన

 

కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన

 

భగవత్ భాగవత కటాక్షాలతో జ్యోతిష శాస్త్ర పరిధిలో కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన అనే అంశంపై ప్రశ్నలు - సమాధానాలు రూపంలో మా శక్తి మేరకు మన పెద్దలు మనకి అనుగ్రహించిన విషయాలని కాస్త మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆస్థాన పంచాంగ సిద్ధాంతి, సుప్రసిద్ధ పంచాంగ కర్త, దైవజ్ఞ శిఖామణి, జ్యోతిష రత్న, శ్రీ ఉ.వే.శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారి ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం.

 

ప్రశ్న:- ఈ కరోనా (కోవిడ్-౧౯) వైరస్ పుట్టుకకు కారణమేమిటి?

 

వందే పద్మావతీం దేవీం మహిషీం వేంకటేశితుః

కృపయాస్మాన్ సముద్ధర్తుం కృతావతరణాం భువి

 

శ్రీవాత్స శ్రీనివాసార్యః శోణుం గోవింద దేశికం

సంప్రాప్తోభయ వేదాంత సారం సద్గురుమాశ్రయే

 

ప్రియ భగవత్ బంధువులందరకూ జై శ్రీమన్నారాయణ. యాజ్ఞికపీఠమ్ నుంచి శ్రీమాన్ కిశోరస్వామి వారి ప్రార్ధన మేరకి పెద్దలు అనుగ్రహించిన విషయాలను మనం చర్చించుకుంటున్నాం.

సమా:- ఈ శార్వరి నామ సంవత్సరంలో పెద్ద ఉపద్రవం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది వికారి నామ సంవత్సరంలో ఏర్పడింది. వికారి నామ సంవత్సరంలో ఆరంభమైన ఈ సన్నివేశం ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? అని మనం ఒకసారి చూసినట్లయితే...

యదా జీవయుతో మందో జీవాద్వా సప్తమే స్ధితః

తదా ప్రజా వినశ్యంతి... అన్నట్లు

 

 బృహస్పతి శనితో కలిసి ఉన్నా,  శని నుండి సప్తమంలో ఉన్నా ప్రజా నాశనం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడతాయి అని ప్రమాణం. అక్టోబర్ ౨౦ ౨౦౧౯ బృహస్పతి శనితో కలవడం. శని గురు కేతు గ్రహాలు ఎప్పుడు ఒకే రాశిలో ఉన్నా యుద్ధాలు, దుర్భిక్షాలు, అంటువ్యాధులు కలుగుతూంటాయి. అదే మిధున కన్య ధనుస్సు మీన రాశులలో అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది. అయితే అదే ధనుస్సులో మూడు గ్రహాల కలయిక జరిగింది. అది సూర్యుడు తులా రాశి నుండీ మకర రాశిలోకి ప్రవేశించే కాలం. ఆ సమయంలో వైరస్ ఏర్పడింది. లేదా పుట్టింది.

 

ప్రశ్న:- ఈ వైరస్ తీవ్రత, ఎక్కడ ఎలా ఆరంభమైంది?

 

సమా:- ఈశాన్య దేశేషు అనే ప్రమాణంతో ఈశాన్య ప్రాంతంలో ప్రారంభం అవుతుంది అనీ, ఆ ప్రాంతంలోనే చైనా ఉంది అని మనకు తెలుస్తోంది. చైనాలోనే ఈ వ్యాధి ప్రారంభమైనా ఆ దేశం అప్పుడే బయట పెట్టలేదని అమెరికన్ రిపోర్ట్ చెబుతోంది కానీ...

 

రవి రాహు మహీపుత్రాః శశి శుక్ర శనైశ్చరాః

ఏక రాశిం గతాశీతే తదా పృథ్వి భయాకులా

పూర్వదేశే మహా పీడా నృపాణాం సంక్షయో భవేత్

ప్రజా నాశో జాయ భయం తస్క.....న సంశయః

 

రవి రాహు చంద్ర శుక్ర శని గ్రహములు ఏకరాశి గతులైనప్పుడు భూమండలమందు భయం ఏర్పడుతుంది. తూర్పు దేశాలలో మహాపీడ, నాయకులకు నాశనము, వ్యాధి భయము, ప్రజా నాశనము నిస్సందేహముగా కలుగుతాయని ప్రమాణం. డిసెంబర్ ౨౬న షష్ఠ గ్రహ కూటమి ౬ గ్రహములైన గురు శని కేతు రవి చంద్ర బుధులతో ధనస్సులో ఏర్పడడం జరిగింది. సాధారణంగా షష్ఠ గ్రహ కూటమి ఏర్పడటం జరుగదు. అలా ఏర్పడితే అది ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది అని అర్థం. అదృష్టం కొద్దీ కుజ శుక్రులు అక్కడ లేరు అది కొంత విశేషం. ఈ గ్రహాల కూటమి వల్ల ఏర్పడ్డ వైరస్ క్రమంగా పెరుగుతూ డిసెంబర్ ౩౧న ప్రపంచానికి తెలిసింది.  ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడే మహామారి ప్రారంభమైంది. ప్రజా వినాశనానికి బీజం పడిందని అని చెప్పవచ్చు. రాహువు ఆర్ద్రా నక్షత్రంలో మిధున రాశిలో, చంద్రుడు కుంభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు మకరంలో గురువు ధనుస్సులో ఉన్నాడు. ధనుస్సులో ఐదుగ్రహాలు కలవటంతో మరొక ’పంచ గ్రహ కూటమి’ ఏర్పడింది.

 జనవరి ౨౩వ తేదీన చంద్ర బుధ శని రవి గ్రహాలు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశించాయి. అప్పుడు గురువు ధనస్సులో ఉన్నాడు. గురు కేతువుల కలయికతో ప్రపంచం అంతా వైరస్ గురించి తెలిసింది. దీనిలో శని సూర్య సూర్యుల కలయిక జరిగింది.  శని సూర్య గ్రహాలు వైర గ్రహాలు. వీరి కలయిక మృత్యు ప్రళయ సూచిక. ఇదంతా మకర సంక్రాంతి తరువాత తారాస్థాయికి చేరుకొని ప్రపంచ దేశాలకు పాకడానికి కారణం అయింది. ఇది అత్యంత దుఃఖాన్ని కలగజేస్తోంది.

 

యదా కర్కస్య సంక్రాంతి రధా మకరస్య సౌ

భవత్కార్యాహి భౌమానం వాణీ దుఃఖ ప్రదామతా

 

 మకర సంక్రాంతి తరువాత ఇది తీవ్రరూపం దాల్చింది. కుజుడు మకరంలో శని గురువులతో కలయిక జరిగింది. అయితే ఫిబ్రవరి ౮న కుజ కేతు గురువుల కలయిక వల్ల ప్రపంచమంతా పెను ప్రమాదంగా మారింది. కనుక కుజ కేతువులతో  గురువు కలవటం వల్లే  వైరస్ ప్రభావితం అయింది. దానివల్లే ప్రపంచమంతా బీభత్సంగా మారిపోయింది అని స్పష్టమవుతోంది. అలాగే ఫిబ్రవరి ౧౮ నుండి మార్చి ౫ వరకు రాహు కేతువుల మధ్యలో ఇతర గ్రహాలు చేరి కాల సర్పదోషం ఏర్పడింది. ఇంకా కొంచెం పరిశీలన చేసినట్లయితే మండుచున్నటువంటి అగ్నిలో ఆజ్యం వేసినట్లయింది.  దాంతో ఈ కాలసర్ప స్థితి ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మానవాళికి ఉపయోగపడే శుభ గ్రహాలకు వాటి ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది. అంటే మంచిని కలిగించే గ్రహములు వాటి శక్తిని కోల్పోవడం వల్ల జనజీవనం స్తంభించడం జరిగింది. అంతే కాకుండా ప్రజలకు మృత్యువు విచిత్రంగా ఉంటుంది. అధికంగా విపత్తులు ఏర్పడతాయి ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉంటుంది అనేది అర్థం అవుతోంది. దాని ప్రకారమే అందరూ అనుభవించారు అనుభవిస్తున్నారు కూడా....

 భారతదేశం గురించి విశేషంగా చెప్పాలంటే మనది ఒక గొప్ప దేశం. ముఖ్యంగా ఆధ్యాత్మికత పొందిన దేశం. ఆధ్యాత్మికత ఎక్కువగా మన దేశంలో వుండటం చేత గ్రహ ప్రభావం అంటే, వాస్తవికంగా చెప్పాలంటే ఎప్పుడైతే బృహస్పతి వక్రించడం శని వక్రించడం లాంటివి జరిగాయో వీటివల్ల మనకు ప్రజా నష్టం ఎక్కువుగా జరగకుండా కాపాడింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే కేతువు ధనస్సులో కుజుడు గురువు కేతువులను వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం, సూర్యుడు కూడా మారడం వల్ల తగ్గుముఖం పడుతుంది అనేది కనబడుతోంది. దీనివల్ల కొంత ప్రశాంతతను ఇస్తుంది. మార్చి ౨౯, ౩౦ తేదీల్లో కేతువుని గురువు కూడా వదిలి పెట్టడం వల్ల కేతువు ఒంటరి వాడయ్యాడు. దీనితో జనాలలో కొంత అవగాహన పెరగడం, కొద్దికొద్దిగా వైరస్ తగ్గినట్లు అనిపించినా కూడా భయాందోళనలు పూర్తిగా ఇది నిర్మూలన అనేది జరగదు. ఆ తరువాత మనకి ఉగాది నాటి నుండి ఒకసారి గ్రహాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మార్చి ౨౫న ఉగాది ఏర్పడింది. శార్వరి అంటే చీకటి అని మాత్రమే అందరికీ తెలిసింది. కానీ చీకట్లను పారదోలడానికి భగవంతుడు ఎలా వస్తాడో కూడా ఇందులో చెప్పాడు. శార్వరిలో చీకటిమయం కాబోతున్న ఈ సంవత్సరంలో మన దేశం ఆధ్యాత్మికతతో కూడిన దేశం కనుక మనల్ని రక్షించడానికి పెరుమాళ్ శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చాడో ఈ శార్వరిని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.

ప్రశ్న:- ఈ సంవత్సరంలో చాతుర్గ్రహ, పంచ గ్రహ, షడ్గ్రహ కూటములు ఎన్ని ఉన్నాయి? వాటి ప్రభావమేమిటి?

సమా:- ఈ శార్వరీ నామ సంవత్సరంలో ౧౦ సార్లు చాతుర్గ్రహ కూటములు, ౪ సార్లు పంచ గ్రహ కూటములు, రెండు సార్లు షట్ గ్రహ కూటములు ఉన్నాయి. కొన్ని ఏర్పడ్డాయి, మరికొన్ని ఏర్పడబోతున్నాయి. వాటివల్ల అనేక రోగపీడలు, పరస్పరము రాజులు కలహించుకోవడం అలాగే వాయుపీడ, దాంతో పాటుగా మంచి వర్షాలు కనిపించినా దాని వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం లాంటివి ఉంటాయి.

ఒకసారి ఆ తేదీలను పరిశీలిద్దాం...

 

ధనుస్సులో బృహస్పతి ఉంటే...

వీత రోగ భయాస్సర్వే చాపస్ధే దేవ పూజితే

హృదయానందినీ ధాత్రీ పరశాలీ సువృష్టిభిః

 

సమస్త జనులు రోగం లేక మంచిగా ఉంటారు. వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి.  మకరంలో బృహస్పతి వచ్చినప్పుడు...

 

అసత్ప్రభో జనాధాత్రీ పూర్ణ సస్యానువృష్టిభిః

వీత రోగ భయాస్సర్వే మకరస్ధే సురార్చితే

 

ఇది మరొక ప్రమాణం. సకల జనులు శత్రు రోగ భయ రహితులై ఉంటారు. సువృష్టి చేత భూమి సస్యశ్యామలమై ఉంటుంది. కుంభంలోకి బృహస్పతి వస్తే...

 

బృహస్పతే కుంభగతే ధరిత్య్రాః కుంభాభిషేకాశ్చ శివాలయేషు

భద్రాసనారోహణ మంగళాప్తిర్మహీ భుజాం శూద్రజనో చ్ఛ్రయస్యాత్

అని శివాలయములో కుంభాభిషేకములు జరుగుతాయి. రాజులు సింహాసనం ఎక్కుతారు. శూద్రులు గొప్ప స్థితికి వస్తారు అని ఒక ప్రమాణం. కానీ ఇక్కడ ఈ సంవత్సరం ముఖ్యంగా బృహస్పతి, శని వక్రించి ఉండటం చేత శని వక్రారంభం అయిన తరువాత అది ద్విగుణీకృతం త్రిగుణీకృతం అయింది ఈ వైరస్. బృహస్పతి వక్రించినప్పటికీ కూడా మన భారతదేశంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక బలం కలిగి ఉండటం చేత ప్రధానమైన ప్రజా నష్టం పెద్దగా జరగకుండా కాపాడింది. గురువు వక్రించి ధనస్సులో కేతువుతో కలవడంతో జూలై ౧నుండి వ ురింత విజృంభిస్తోంది.

ప్రశ్న:- ఈ కరోనా అంతమయ్యేది ఎప్పుడు?

సమాధానం:- రేపు ౧౩.౯.౨౦౨౦న గురువు త్యాగం అవుతున్నాడు అంటే తదుపరి వ్యాక్సిన్ లాంటి ఔషధం రావచ్చు. అలాగే ౨౯ సెప్టెంబర్ శని వక్ర త్యాగం కనుక ఈ కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతుంది అని తెలుస్తోంది. అలాగే ౧౮ నవంబర్ కేతువు ధనస్సు వీడి వృశ్చికానికి వెెడుతున్నాడు. ఆ వెళ్లడం చేత ఈ కరోనా వ్యాధి దానంతట అదే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. దాని కంటే ముందుగా ఇంకా చూస్తే మనకి రేపు అధిక ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి  ౨౪ సెప్టెంబర్ నుండి దీని తగ్గుముఖం పట్టి ఒక ఔషధం కనిపించే అవకాశం విశ్వాసంతో పూర్తిగా మనం చెప్పడానికి ఆస్కారం ఉంది.

ప్రశ్న:- ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలాంటి వైదిక కర్మలను ఆచరించాలి?

సమాధానం:- కాలచక్రంలో ఉపద్రవములు ఏర్పడ్డప్పుడు అద్భుత శాంతులు చేయటానికి ఒక ప్రక్రియ ఉంది. అది మనకి స్పష్టంగా ఋష్యాదులు లాంటి పెద్దలు మనకు అనుగ్రహించారు.  షష్ఠ గ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?

చాతుర్గ్రహ కూటములు బాగా ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?

పంచ గ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?

అనేది ఈ ప్రాయశ్చిత్త కాండలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా అనేక ఉపద్రవాలు ఏర్పడ్డప్పుడు, జగత్తుకి సంక్షోభం ఏర్పడ్డప్పుడు అద్భుతశాంతి జరిపినట్టుగా మనకి ఒక ప్రమాణం కూడా కనబడుతోంది.

ప్రశ్న:- మరి దీన్ని గతంలో ఎవరైనా ఎప్పుడైనా ఆచరించారా?

సమాధానం:-  భృగువు అనే మహర్షి పూర్వం ఆచరించాడు అని ఉంది. శ్రీ మహావిష్ణువుకి ౨ పాదములు - మూలా నక్షత్రం. ౨ పిక్కలు - రోహిణి నక్షత్రం. ౨ మోకాళ్ళు - అశ్విని నక్షత్రం. ౨ తొడలు - పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు. ౨ పృష్ఠము - పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు.  నడుము - కృత్తికా నక్షత్రం. ౨ పార్శ్వాలు - పూర్వాభాద్ర ఉత్తరాభాద్రలు. ఉభయ కుక్షి - రేవతి నక్షత్రము. వక్షస్థలం - అనురాధ. పృష్ఠ ప్రదేశం - ధనిష్ఠ. ౨ భుజములు - విశాఖ. ౨ చేతులు - హస్త. వ్రేళ్ళు - పునర్వసు. గోళ్ళు - ఆశ్రేష. కంఠము - జ్యేష్ఠ.  చెవులు - శ్రవణం. ముఖము - పుష్యమి. దంతము - స్వాతి. దవడలు - శతభిష. ముక్కు - మఖ. నేత్రములు - మృగశిర. లలాటమ - చిత్త. శిరస్సు - భరణి. జుట్టు - ఆర్ద్ర. ఇలా శ్రీమహావిష్ణు స్వరూపాన్ని వర్ణించబడిఉంది. దీన్ని నక్షత్ర పురుషము అంటారు. ఈ నక్షత్ర స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపము అనీ, దీన్ని జగత్ సంక్షోభము ఏర్పడినప్పుడు అద్భుత శాంతి ప్రక్రియగా భృగుమహర్షి ఆచరించాడు. అని ఇలాంటి నక్షత్ర స్వరూప శ్రీమహావిష్ణు యాగం ఆచరిస్తే సర్వపాతకములు నశిస్తాయి. సప్త జన్మలలో జరిగిన పాతకములూ నశిస్తాయి. కుల సాంకర్యం వలన వచ్చింది కానీ, లేదా తల్లిదండ్రుల వలన వచ్చినదైనప్పటికీ కూడా దాన్ని ఉపశమింపచేస్తుంది. దీని వలన చక్కని రూపం కలుగుతుంది. సర్వశుభాలు కలుగుతాయి. ఉత్తమమైన శరీర ఆరోగ్యం కలుగుతుంది. అంతులేని మనస్సంతృప్తి కలుగుతుంది. చక్కని వాక్ మాధుర్యం కలుగుతుంది. కాంతి ఏర్పడుతుంది. ఉత్తమమైన జాతి ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైనది. ధన్యమైనది. శ్రేయోదాయకమైనది.